బ్రహ్మం గారు సాక్షాత్ దైవ స్వరూపుడు. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి, జనులందరిని సన్మార్గంలో నడువమని బోధించిన మహిమాన్వితుడు. చరిత్రకారుల కాలజ్ఞాన పరిశోధన ఫలితంగా, బ్రహ్మం గారు చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకున్నారు. కర్ణాటక లోని పాపాఘ్ని మఠాధిపతి యనమదల వీరభోజయచార్యులు, సతీ సమేతంగా సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటాడు. సంతాన ప్రా్తి కై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు, దైవ స్వరూపులు అయిన బ్రహ్మం గారిని అత్రి మహాముని అందజేస్తాడు.
వీరభోజయాచార్య, ఈ బాలుడు, మహిమాన్వితుడు, మునుముందు, ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు.ఆ విధంగా బ్రహ్మం గారు పాపాఘ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. (ఈనాడు కర్ణాటక లోని పాపాఘ్ని మఠం బ్రహ్మం గారి ప్రథమ మఠంగా పేరు గాంచి దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్నది). అతి చిన్న వయసులోనే, బ్రహ్మం గారు కాళికాంబ పై సప్తశతి రచించి అందరిని అబ్బురపరుస్తాడు. బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజయచార్యులు స్వర్గాస్తులవుతారు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతు తన తల్లి ఆశీర్వాదాలు కోరతాడు. అందుకు, వారి తల్లి, నాయన, వీరంభోట్లయ్య (బ్రహ్మం గారు చిన్న నాడు వీరంభోట్లయ్యగా పిలువబడ్డారు, పాపాఘ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు ఉన్నాయి), మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశాటనకు బయల్దేరితే ఎలాగంటూ శోక సంద్రంలో మునిగి పోతుంది. అప్పుడు బ్రహ్మం గారు, తన తల్లి గారికి సృష్టి క్రమాన్ని వివరించాడు. స్త్రీ పురుషుల సంభోగం పవిత్ర కార్యమని, శుక్రశోణితంతో స్త్రీ గర్భ ధారణ గావించాక, గర్భం ధరించిన ప్రతి నెలలో, కడుపులో శిశువు ప్రాణం పోసే విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు బ్రహ్మం గారు. ఆగామి, ప్రారబ్ధ, సంచిత కర్మ సిద్ధాంతము గురించి వివరించి ఆమెకు మాయ తెరను తొలగించి, లోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయల్దేరతారు బ్రహ్మం గారు.
కర్నూలు జిల్లాలొని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉంటు, రవ్వలకొండలో కాలజ్ఞానం వ్రాశారు. ఆవుల చుట్టూ గిరి గీసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మం గారు. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాలన్నీ చూచి భయపడి పరుగు పరుగున, అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చేరవేస్తారు. మరుసటి రోజున యథావిధిగా ఆవులను తీసుకుని వెళ్లి చుట్టూ గిరి గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మం గారిని చూసి ఆశ్చర్య పోతుంది అచ్చమ్మ. (అచ్చమ్మ బ్రహ్మం గారిని దర్శించుకున్న రవ్వలకొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మం గారి దేవాలయం ఉన్నది).
బ్రహ్మం గారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ, ప్రుట్టు గుడ్డి వాడైన తన కొడుకు బ్రహ్మానంద రెడ్డికి చూపు ప్రసాదించమని ప్రార్థిస్తుంది. బ్రహ్మం గారు తన దివ్య దృష్టితో, బ్రహ్మానంద రెడ్డి గత జన్మ పాపాలను దర్శించి, అతనికి చూపు ప్రసాదించి, పాప నివృత్తి గావించారు. గుహలో కూర్చుని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నాయి. కాలజ్ఞానం వ్రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లాయపల్లె చేరి వడ్రంగి వృత్తిచేస్తూ గడిపాడు. తనవద్దకు వచ్చినవారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించాడు.